- 49.6 కిలోల బంగారాన్ని తరలించిన రన్యా రావు
- కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు కూతురు ఘనకార్యం
సహనం వందే, బెంగళూరు:
కర్ణాటక డీజీపీ రామచంద్ర రావు కూతురు, కన్నడ నటి రన్యారావు బంగారు అక్రమ రవాణా కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు ఈ కేసులో కీలక వివరాలను వెల్లడించారు. రన్యారావు 49.6 కిలోల బంగారాన్ని అక్రమంగా తరలించి, దానిని విక్రయించడంలో జ్యూయలర్ సహిల్ సకారియా జైన్ సహకరించినట్లు తేలింది. ఈ దొంగ బంగారం విలువ రూ. 40.14 కోట్లు. గత నెల మూడో తేదీన బెంగళూరు కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆమె దుబాయ్ నుండి 14.2 కిలోల బంగారంతో రహస్యంగా భారత్కు తీసుకొచ్చింది. ఈ బంగారాన్ని ఆమె శరీరంపై మెడికల్ ప్లాస్టర్, బ్యాండేజీలతో చుట్టి దాచుకుంది. డీఆర్ఐ అధికారులు ఆమెను పట్టుకుని, తదుపరి దర్యాప్తులో ఆమె నివాసంలో 2.06 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, రూ. 2.67 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. నవంబర్ 2024 నుండి ఫిబ్రవరి 2025 వరకు ఆమె నాలుగు సార్లు దుబాయ్ నుండి మొత్తం 49.6 కిలోల బంగారాన్ని తీసుకొచ్చినట్లు తేలింది.
హవాలా లావాదేవీలు…
ఈ భారీ స్మగ్లింగ్ కుంభకోణంలో కీలక పాత్రధారి సాహిల్ జైన్ అనే ఆభరణ వ్యాపారి. బళ్లారి స్వస్థలంగా ఉన్న ఈ వ్యాపారి, బెంగళూరులోని కబ్బన్పేటలో నివసిస్తూ రన్యాకు సాయం చేశాడు. గత ఏడాది నవంబర్ లో 8.98 కిలోల బంగారంతో మొదలై, ఈ ఏడాది ఫిబ్రవరిలో 13.43 కిలోల వరకు ఈ అక్రమ బంగారాన్ని జైన్ ద్వారా విక్రయించినట్లు డీఆర్ఐ తెలిపింది. ఈ వ్యవహారంలో జైన్ 38.39 కోట్ల రూపాయలను హవాలా మార్గం ద్వారా దుబాయ్కు పంపాడు. అలాగే 1.73 కోట్ల రూపాయలను రన్యాకు బెంగళూరులో అందజేశాడు. ప్రతి బంగారు లావాదేవీకి జైన్ 55,000 రూపాయల కమీషన్ తీసుకున్నట్లు వెల్లడైంది.
హవాలా రాకెట్లో తెరవెనుక కథ…
రన్యారావు ఈ స్మగ్లింగ్లో ఒక చిన్న పాత్రధారి మాత్రమేనని, దీని వెనుక పెద్ద హవాలా రాకెట్ ఉందని డీఆర్ఐ అధికారులు అనుమానిస్తున్నారు. గత నవంబర్ లో ఒక థాయ్లాండ్ ఫోన్ నంబర్ ద్వారా రన్యారావు జైన్తో పరిచయం ఏర్పడినట్లు తెలుస్తోంది. అలాగే తెలుగు నటుడు తరుణ్ కొండూరు (విరాట్ కొండూరు) కూడా ఈ కేసులో ప్రమేయం ఉన్నాడు. అమెరికా పౌరసత్వం కలిగిన తరుణ్, దుబాయ్లో బంగారాన్ని సేకరించి రన్యాకు అందజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ బంగారాన్ని జెనీవాకు తీసుకెళ్తున్నట్లు దుబాయ్ కస్టమ్స్లో చూపించి, రన్యా ద్వారా భారత్కు తరలించినట్లు డీఆర్ఐ పేర్కొంది.
బంగారు ధరల పెరుగుదలతో స్మగ్లింగ్ జోరు…
2024-25లో 24 క్యారెట్ బంగారం ధరలు 10 గ్రాములకు 75,000 రూపాయల నుంచి ఈ మార్చి నాటికి 89,000 రూపాయలకు చేరాయి. ఈ ధరల పెరుగుదలతో స్మగ్లింగ్ కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి. రన్యారావు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని హవాలా ద్వారా భారీ మొత్తంలో నగదును దుబాయ్కు తరలించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసు కేవలం ఆమెతోనే ఆగిపోదని, దీని వెనుక ఉన్న పెద్ద రాకెట్ను ఛేదించేందుకు డీఆర్ఐ ప్రయత్నిస్తోంది.
కేసు ఎక్కడి వరకు వచ్చింది?
అరెస్టైన తర్వాత ఆమె బెయిల్ పిటిషన్ మూడు సార్లు తిరస్కరించారు. ప్రస్తుతం ఆమె కర్ణాటక హైకోర్టులో బెయిల్ కోసం పోరాడుతోంది. సాహిల్ జైన్ కూడా ఈ కేసులో అరెస్టై జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నాడు. ఈ కేసు రాజకీయ, సినీ రంగాల్లో కలకలం సృష్టించింది, ముఖ్యంగా రన్యా సవతి తండ్రి, కర్ణాటక డీజీపీ రామచంద్ర రావుపై కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ స్మగ్లింగ్ కథలో ఇంకా ఎన్ని మలుపులు ఉన్నాయో చూడాలి. డీఆర్ఐ అధికారులు ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.