హత్యలు, అత్యాచారాలు, సైబర్ నేరాలతో అట్టుడుకుతోన్న తెలంగాణ
– హైదరాబాద్లో విదేశీ యువతిపై అఘాయిత్యం
– గతవారం ఎంఎంటీఎస్ రైలులో మహిళపైనా ఇదే పరిస్థితి దాడి – భద్రత ఎక్కడ?
– హైదరాబాద్ నడిబొడ్డున అడ్వకేట్ హత్య సంచలనం
– బెట్టింగ్ యాప్ లతో ఆత్మహత్యలు… ఇటీవల రైలు పట్టాల కింద పడి యువకుడి ఆత్మహత్య
– హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమి వివాదం… విద్యార్థులపై లాఠీచార్జి
– హోం మంత్రి లేక నిర్లక్ష్యం… ముఖ్యమంత్రే బాధ్యతలు చూస్తుండటంతో తగ్గిన కేంద్రీకరణ
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రం నేరాల మయంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు భారీగా పెరిగాయి. హైదరాబాద్లో నడిరోడ్డుపై హత్యలు, విదేశీ యువతీపై అఘాయిత్యం, ఎంఎంటీఎస్ రైళ్లలో అత్యాచార ప్రయత్నాలు, బెట్టింగ్ యాప్లతో ఆత్మహత్యలు – ఈ ఘటనలన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని, పోలీసు వ్యవస్థ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వివాదంపై విద్యార్థుల ఆందోళనలు… వారిపై పోలీసుల లాఠీచార్జి… పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. ఏడాదిన్నరగా రాష్ట్రానికి హోం మంత్రి లేకపోవడం, ఆ బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నప్పటికీ, ఆయనపై ఇతర బాధ్యతల ఒత్తిడితో శాంతిభద్రతలు పూర్తిగా నశించాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
విదేశీ యువతిపై అత్యాచారయత్నం…
హైదరాబాద్లో విదేశీ యువతిపై అత్యాచారయత్నం జరిగింది. లిఫ్ట్ ఇస్తామని కారులో ఎక్కించుకున్న దుండగులు మార్గమధ్యంలో యువతిపై అఘాయిత్యం చేశారు. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో మంగళవారం కేసు నమోదు చేశారు. అలాగే గత నెల 23వ తేదీన హైదరాబాద్లోని ఎంఎంటీఎస్ రైలులో ఓ ఉద్యోగినిపై అత్యాచార ప్రయత్నం జరిగింది. నిందితుడి నుంచి తప్పించుకునేందుకు ఆమె కదులుతున్న రైలు నుంచి దూకడంతో తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ‘ప్రభుత్వం అందాల పోటీల్లో బిజీగా ఉంది, మహిళల రక్షణ గురించి పట్టించుకోవడం లేదు” అని బీఆర్ఎస్ నేతలు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు.
నగరం నడిబొడ్డున అడ్వకేట్ హత్య…
హైదరాబాద్లో ఓ అడ్వకేట్ను నడిరోడ్డుపై నరికి చంపిన ఘటన పోలీసు వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం. “పట్టపగలు న్యాయవాదిని హత్య చేస్తే సామాన్య ప్రజల గతి ఏమిటి? పోలీసులు నిద్రపోతున్నారా?” అని మంచిర్యాల్ న్యాయవాద సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. కమాండ్ కంట్రోల్ రూమ్ ఎదురుగానే కానిస్టేబుల్పై దాడి జరిగిన సంఘటన కూడా ఉంది.
ప్రేమ వివాహం కారణంగా హత్య…
ప్రేమించి పెళ్లి చేసుకున్నామనే కారణంతో ఓ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. గత నెల 10వ తేదీన నల్గొండ కోర్టు ప్రణయ్ హత్య కేసులో నిందితులకు శిక్ష విధించినా, ఇలాంటి హత్యలు ఆగడం లేదు. “కోర్టు తీర్పులు వస్తున్నా, ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
జవహర్నగర్ జంట హత్యలు…
జవహర్నగర్లో లక్ష్మి అనే మహిళ తన ప్రియుడు అరవింద్తో కలిసి తల్లి సుశీల, అక్క జ్ఞానేశ్వరిని హత్య చేసిన ఘటన రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ హత్యలను దోపిడీగా చిత్రీకరించేందుకు నగలు దోచుకున్నారు. “ఇంట్లోనే ఇంత దారుణం జరిగితే బయట ఎలా ఉంటుంది?” అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్లో దంపతులను గొంతు కోసి చంపిన ఘటన, సంగారెడ్డిలో టీఆర్ఎస్ నేతను ముక్కలుగా నరికిన సంఘటనలు రాష్ట్రంలో నేరాల తీవ్రతను చాటుతున్నాయి. “ప్రభుత్వం నిద్రపోతోందా? ఈ దారుణాలపై స్పందన ఎందుకు లేదు?” అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హబ్సిగూడలో కుటుంబ ఆత్మహత్య… బెట్టింగ్ యాప్లతో యువకుడి మృతి
హబ్సిగూడలో చంద్రశేఖర్ రెడ్డి తన ఇద్దరు పిల్లలను చంపి, భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్న ఘటన విషాదకరం. “మధుమేహం, కిడ్నీ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు” కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఇక, తాజాగా మేడ్చల్లో క్రికెట్ బెట్టింగ్లో రూ. 2 లక్షలు నష్టపోయిన ఓ యువకుడు రైలు పట్టాలపై ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపింది. “ప్రజల ఆర్థిక భద్రత కోసం ప్రభుత్వం ఏం చేస్తోంది?” అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నేరాల గణాంకాలు…
రాష్ట్ర డీజీపీ జితేందర్ విడుదల చేసిన 2024 వార్షిక క్రైమ్ రిపోర్ట్ రాష్ట్రంలోనే నేరాల తీవ్రతను బట్టబయలు చేస్తోంది. 2024లో మొత్తం 2,34,158 కేసులు నమోదయ్యాయి, ఇది 2023తో పోలిస్తే 9.87% పెరుగుదలను సూచిస్తుంది.
– హత్యలు: 856 కేసులు
– అత్యాచారాలు: 2,945 కేసులు – 2.12% పెరుగుదలతో మహిళల భద్రత ప్రశ్నార్థకం.
– దొంగతనాలు: 19,480 కేసులు – 16.32% పెరుగుదలతో ఆస్తులకు రక్షణ లేదు.
– సైబర్ నేరాలు: 25,184 కేసులు – 43.3% పెరుగుదలతో డిజిటల్ భద్రత కూడా దెబ్బతింది.
– డ్రగ్స్ కేసులు: 1,942 కేసులు – రూ. 142.95 కోట్ల మాదక ద్రవ్యాల స్వాధీనంతో యువత భవిష్యత్తు ప్రమాదంలో పడింది.
– మహిళలపై నేరాలు: గత ఐదేళ్లలో 4.78% పెరిగాయి. అత్యాచార కేసులు 2.12% పెరగగా, వరకట్న హత్యలు 33.33% తగ్గి 22 కేసులకు చేరాయి. అయినా, మహిళల భద్రతపై ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి కొనసాగుతోంది.
హోంమంత్రి లేకపోవడం నిర్లక్ష్యానికి కారణమా?
ఏడాదిన్నరగా తెలంగాణకు హోం మంత్రి లేకుండా పోయింది. ఆ బాధ్యతలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చూస్తున్నారు. అయితే, ఆయనపై అనేక రాజకీయ, పరిపాలన బాధ్యతలు ఉండటంతో హోం శాఖపై దృష్టి పెట్టే సమయం లేకపోవడం శాంతిభద్రతల క్షీణతకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. దీంతో పోలీసు శాఖ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు వస్తున్నాయి. “హోం మంత్రి లేకపోవడం వల్ల పోలీసులకు జవాబుదారీతనం తగ్గింది. ఈ పరిస్థితి రాష్ట్రంలో నేరాల పెరుగుదలకు దారితీసింది” అని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వంపై ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శ…
“కాంగ్రెస్ వచ్చిన 8 నెలల్లో 500 హత్యలు, 1800 అత్యాచారాలు, 10,000 దొంగతనాలు జరిగాయి. హైదరాబాద్లోనే నెల రోజుల్లో 28 హత్యలు జరిగాయి. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారు?” అని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ప్రశ్నించారు.
శాంతిభద్రతలకు క్షీణించాయన్న సీపీఎం
తెలంగాణ రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు, మతోన్మాద దాడులు పెరుగుతున్నాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ నడిబొడ్డున న్యాయవాది ఇజ్రాయిల్ హత్య, ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం వంటి ఘటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో కుల దురహంకార హత్యలు కూడా పెరుగుతున్నాయని ఆయన ఆరోపించారు.