గూడు కోసం జర్నలిస్టుల గోడు

  • జర్నలిస్టుల్లో 80% బడుగు బలహీన వర్గాలే
  • 20 శాతం మంది దిగువ మధ్య తరగతి
  • వారందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవశ్యం
  • ఫ్యూచర్ సిటీలో ఇళ్ల జాగా కోసం పోరాటం
  • ఐక్య కార్యాచరణకు సొసైటీల ప్రయత్నాలు

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో జర్నలిస్టులుగా పనిచేస్తున్న వారిలో దాదాపు 80 శాతం మంది బడుగు, బలహీన వర్గాల నుంచి వచ్చినవారే. మిగిలిన 20 శాతం మంది దిగువ మధ్య తరగతి నేపథ్యం గలవారు. అయినప్పటికీ, జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో జర్నలిస్టులను సంపన్న వర్గాలుగా వ్యాఖ్యానించడం విచారకరం. ఈ తీర్పు నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన హామీ అమలు సందిగ్ధంలో పడింది. ఈ పరిస్థితుల్లో జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమవుతున్నాయి.

ఆర్థిక ఇబ్బందుల్లో జర్నలిస్టు కుటుంబాలు…
జర్నలిస్టుల్లో అత్యధిక శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి వచ్చినవారే. మీడియా రంగంలో పనిచేసే వీరు చాలామంది తమ కుటుంబాలను పోషించుకోవడానికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బడా పత్రికలు, టీవీ ఛానెళ్ల మేనేజ్‌మెంట్లు తప్ప, సామాన్య జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా మీడియా సంస్థలు అత్యంత తక్కువ వేతనాలు ఇస్తున్నాయి. దీంతో చాలీచాలని జీతాలతో జీవితాన్ని భారంగా గడపాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు జర్నలిస్టులను సంపన్న వర్గాలుగా చిత్రీకరించడం వాస్తవానికి దూరంగా ఉందని జర్నలిస్టు మేధావులు అంటున్నారు. “80 శాతం మంది బడుగు వర్గాల నుంచి వచ్చినప్పుడు వారు సంపన్నులు ఎలా అవుతారు?

జర్నలిస్టుల ఆశలపై నీళ్లు…
జవహర్‌లాల్ నెహ్రూ జర్నలిస్ట్ మ్యూచువల్ ఎయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ కోసం పెట్‌బషీరాబాద్‌లో 38 ఎకరాల భూమిని కేటాయించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశించినప్పటికీ, తాజా తీర్పులో జర్నలిస్టులను సంపన్న వర్గంగా పేర్కొనడం వివాదాస్పదమైంది. ఈ తీర్పు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేటాయింపును అడ్డుకుంటూ, వారి దశాబ్దాల కలను అగమ్యగోచరంగా మార్చింది. “బడుగు వర్గాలకు ప్రభుత్వం ఇళ్లు, స్థలాలు, సంక్షేమ పథకాలు అందిస్తుంది. మరి జర్నలిస్టులు కూడా అదే వర్గాల నుంచి ఎక్కువమంది వచ్చినప్పుడు వారికి ఈ హక్కు ఎందుకు ఉండకూడదు?” అని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ (డీజేహెచ్ఎస్) కోశాధికారి అయ్యప్ప అంటున్నారు.

ఫ్యూచర్ సిటీపై ఆశలు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో జర్నలిస్టులకు ఫ్యూచర్ సిటీలో ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ప్రకటించారు. “జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీ ఫైల్‌పై ఒక నిమిషంలో సంతకం చేస్తాను” అని ఆయన హామీ ఇచ్చినప్పటికీ, సుప్రీంకోర్టు తీర్పు ఈ ప్రక్రియకు అడ్డంకిగా మారింది. ఈ నేపథ్యంలో జర్నలిస్టులు ముఖ్యమంత్రి వైఖరిపై ఆశాభావం వ్యక్తం చేస్తూనే, హామీ అమలు కోసం ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. “ముఖ్యమంత్రి సానుకూలంగా ఆలోచిస్తే సుప్రీంకోర్టు తీర్పును సమీక్షించేందుకు చర్యలు తీసుకోవచ్చు” అని జర్నలిస్టు నాయకులు సూచిస్తున్నారు.

ఉమ్మడి పోరాటానికి కార్యాచరణ…
హైదరాబాద్‌లో జర్నలిస్టుల ఇళ్ల స్థలాల డిమాండ్ కోసం జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ, డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ, తెలంగాణ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీలు ఉమ్మడిగా పోరాడాలని నిర్ణయించాయి. త్వరలో ఈ సొసైటీలు సంయుక్త సమావేశం నిర్వహించి, కార్యాచరణను ప్రకటించనున్నాయి. “మా డిమాండ్ సాధారణ జర్నలిస్టుల హక్కు కోసం. దీన్ని సాధించే వరకు ఆగబోము,” అని డెక్కన్ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఉపాధ్యక్షుడు మరిపాల శ్రీనివాస్ తెలిపారు. “బడుగు వర్గాల జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తే, వారి జీవన ప్రమాణాలు మెరుగవుతాయి. ఇది ప్రభుత్వ బాధ్యత కూడా,” అని ఆయన అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును సవాలు చేసేందుకు చట్టపరమైన మార్గాలను అన్వేషించడంతో పాటు, ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు జర్నలిస్టు సొసైటీలు సన్నాహాలు చేస్తున్నాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *